fvz

Wednesday, July 08, 2015

సామాన్యుడి నాడి తెలిసిన నాయకుడు...

∎ నీ చిరునవ్వు.. మా గుండెల్లో చెరగని జ్ఞాపకం
∎ నీ నాయకత్వం.. మా బతుకుల్ని వెలిగించిన దీపం 
∎ నీ సంక్షేమాభిలాష.. మా పాలిట సంజీవని
∎ మా ఆత్మ బంధువైన.. నిన్ను ఎన్నటికీ మరువం రాజన్నా

అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమమూ అంతే ముఖ్యమని నమ్మిన ప్రజానాయకుడు.. బీడు భూముల్లో ఆనందపు సిరులు నింపేందుకు జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు.. పేద ప్రజల ఆరోగ్యమే తనకు మహాభాగ్యమన్న మహానేత.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్న రాజనీతిజ్ఙుడు రాజన్న. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటానన్న ఆ మేరునగ ధీరుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాయి. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగనన్నకు ఓ దిక్సూచిలా పనిచేస్తున్నాయి.

‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలి. బీడు బడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరుడు నిండాలి’’ అని వైఎస్సార్‌ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించి గ్లోబలైజేషన్‌ వెంట పరుగులు పెడుతున్న పాలకులకు మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. దేశానికి వెన్నెముకైన రైతును రాజును చేసేందుకు జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి.. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని ఆరంభించి, అనుమతులు తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేశారు. గుండ్లకమ్మ, వెలిగొండ, అలీసాగర్, సుద్దవాగు, దేవాదుల, సురంపాలెం, మద్దువలస, పెద్దేరు ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరథుడిగా అన్నదాతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

అంతేగాక ఉచిత విద్యుత్‌ పథకం మీద తొలి సంతకం చేసి.. ‘వ్యవసాయం దండగ.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అన్న గత పాలకుల మాటలు తలకిందులు చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అలా రాజన్న పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులకు రాష్ట్ర విభజన తర్వాత మరోసారి కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హామీలను తుంగలో తొక్కి రైతులకు తీరని అన్యాయం చేసింది. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కష్టాల పాలు చేసింది. అటువంటి సమయంలో రాజన్న వారసుడు జగనన్న అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 

‘‘వైఎస్సార్‌ రైతు భరోసా’’ పేరిట బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాది పాలనలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంతేగాక రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో జనతా బజార్‌ ఏర్పాటు చేయడం సహా... రైతులు పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముకునే వీలు కల్పించారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి మంచి ధర లభించేలా ప్రణాళికలు రచించారు. అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ఏర్పాటు చేసి.. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. 


పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేసి, రైతులపై ఏ మాత్రం భారం పడకుండా వారు కేవలం ఒక రూపాయి కడితే చాలు.. ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్‌ వెల్స్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా నిలబడుతూ రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి యెడుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డిని రాజన్నగా పేద ప్రజలకు చేరువ చేసిన అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. నిజానికి ఇది వైఎస్సార్‌ మానస పుత్రిక వంటిది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా రూపొందించిన ఈ ఆరోగ్య బీమా పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజల పాలిట సంజీవనిలా మారింది. 2007లో ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా రూపొందించారు. ఆ తర్వాత రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. పార్టీలకు అతీతంగా అర్హులందరు వైద్య సహాయం పొందారు. 108 సర్వీసులతో ఎంతో మందిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం సహా 104 వాహనాలు(సంచార వైద్యశాలలు )లతో ఎంతో మందికి ఔషధాలు అందించారు.


‘‘నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’’ అన్న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను అమలు చేశారు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పేరుతో పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసే కొత్త కార్డులను పంపిణీ చేశారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్‌ ప్రాజెక్టుకు జనవరిలోనే శ్రీకారం చుట్టారు. క్యాన్సర్‌ సహా 2,059 వ్యాధులకు వైద్యం చేయిస్తామని.. బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అవ్వా తాతలకు కంటి వెలుగు పథకం తీసుకువచ్చారు. 

అదే విధంగా వైద్య రంగంలో సమూల మార్పులు చేపట్టి.. . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసేందుకు నాడు –నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్‌ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. భారీగా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు సింగిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మించబోతున్నారు. 


ఇక జూలై 1న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన 108, 104 కొత్త వాహనాల ప్రారంభోత్సవం ఎంత కన్నుల పండువగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1,088 వాహనాలు ఒకేసారి సేవల్లోకి బయలుదేరి వెళ్లాయి. రాజన్న వారసుడి ప్రజారోగ్య రథయాత్రకు ప్రజలంతా నీరాజనం పట్టారు. 108, 104 వాహనాలు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి వివిధ జిల్లాలకు తరలివెళ్తున్న దృశ్యాల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో మరోసారి పేద ప్రజల కళ్లల్లో ఆశాజ్యోతులు వెలిగించారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మూడు ప్రధాన నగరాల్లో 130 ఆసుపత్రులను ఎంపానల్‌ చేశారు. అంతేగాకుండా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సహా.. ప్రాణాంతక వైరస్‌ సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పేదరికం ప్రతిభకు ప్రతి బంధకం కాకూడదని.. ఉన్నత విద్యనభ్యసించాలనే కలకు ఆటంకం కారాదని భావించారు వైఎస్సార్‌. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఒకరు ఉన్నా.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆయన నమ్మారు. అందుకే చదు‘కొన’లేని విద్యార్థులకు చేయూత అందించడమే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్‌, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థుల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా పథకాన్ని రూపొందించారు. ఈ విప్లవాత్మక పథకం ద్వారా లబ్ది పొంది ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కెరీర్‌లో స్థిరపడ్డారు. 


వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కూడా ఒకటి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని.. ఏ ఉన్నత చదువుకైనా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించిన ఆయన గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేశారు. అదే విధంగా జగనన్న వసతిదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు సిద్ధమయ్యారు. 

అంతేగాకుండా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘జగనన్న విద్యా కానుక’తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్‌ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధులను చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

వృద్ధాప్యం భారం కాకూడదనే ఆలోచనతో వైఎస్సార్‌ అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా పెన్షన్లు అందే ఏర్పాటు చేశారు. ఆసరాలేని వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి ఈ పెన్షన్లు చేయూతనిచ్చాయి. కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను మార్చి అర్హులందరికీ పెన్షన్‌ అందేలా ఆయన చర్యలు తీసుకున్నారు. 


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసి తండ్రి ఆశయ వారసత్వాన్ని నిలబెట్టారు. ఓ అడుగు ముందుకేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుడి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్‌ డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు.‘గడప వద్దకే పెన్షన్‌’ కార్యక్రమాన్ని అమలు చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగుల కళ్లలో ఆనందం నింపారు.  గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం.. ప్రజల వద్దకే పాలనను ఆవిష్కృతం చేశారు. 

నాడు ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మేనిఫెస్టో’  రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ పాలన అందిస్తున్నారు. 


గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా అప్పులు స్వాగతం పలికినా చిరునవ్వు చెరగనీయక ముందుకు సాగుతున్నారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే ఏడాది కాలంలోనే 77 హామీలను అమలు చేసి, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్‌ ప్రకటించి.. ఇంకా మిగిలి ఉన్న 16 హామీలను కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ కాపునేస్తం తదితర పథకాలు అమలు చేశారు. అక్కాచెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ దాదాపు 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు సన్నద్ధమయ్యారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇంత గొప్పగా ప్రజల రుణం తీర్చుకుంటూ, తండ్రి పేరు ప్రతిష్టలు నిలబెడుతూ... నువ్వు మాతోనే ఉన్నావన్న అభయం ఇస్తున్న తనయుడిని కన్న రాజన్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! అలాగే రైతు దినోత్సవ శుభాకాంక్షలు!!



 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top