fvz

Friday, May 24, 2019

This is people's landslide victory, says YS Jagan Mohan Reddy


‘నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి... నిస్వార్థంగా ఉండండి... అనంత సహనం కలిగి ఉండండి... అంతిమంగా విజయం మీదే’ – స్వామి వివేకానంద

గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానంలో త్రికరణశుద్ధిగా ఆచరించి చూపారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఓ గొప్ప ముఖ్యమంత్రిగా చూసిన యువనేతగా వైఎస్‌ జగన్‌ దశాబ్దం క్రితం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 

వైఎస్సార్‌ మరణించిన తరువాత కూడా కోట్లాది మంది గుండెల్లో జీవించి ఉండటం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. తానూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ధ్యేయంతో ప్రజాపథంలో సాగారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని దక్కించుకుందామన్న కొందరి సూచనలను తిరస్కరించి రాజకీయ విలువలు చాటారు.  కేంద్ర మంత్రి, సీఎం పదవులు ఇస్తామన్నా సరే తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు అధికారాన్ని తృణప్రాయంగా త్యజించారు. 

రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై పన్నిన కుట్రలు, బనాయించిన అక్రమ కేసులను అత్యంత సహనంతో ఎదుర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తనపై దుష్ప్రచారానికి దిగి 2014లో అధికారానికి దూరం చేసినా ప్రజాపథాన్ని వీడలేదు. రాష్ట్ర హక్కులు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమపథంలో సాగారు. తమ పార్టీ టికెట్లపై నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుని రాజ్యాంగ విలువను అపహాస్యం చేసినా తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు చరిత్రాత్మక రీతిలో 3,648 కి.మీ. పాదయాత్ర చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు యత్నించినా వెరవలేదు. లోపాయికారీ పొత్తుల కుట్రలకు బెదరలేదు. 

రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం అజెండాగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజాతీర్పు కోరారు. పదేళ్లుగా మొక్కవోని దీక్షతో సాగుతున్న జగన్‌కు రాష్ట్రం యావత్తూ జేజేలు పలికింది. ‘ప్రజలు ఆశీర్వదిస్తే సంక్షేమరాజ్యం స్థాపిస్తా’ అన్న జగన్‌కు పట్టాభిషేకం చేసింది. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో రికార్డు సీట్లతో వైస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు.

తొలి అడుగులు

అత్యంత ప్రజాదరణ కలిగిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌  తాను యువరాజు హోదా అనుభవించాలని ఏనాడు భావించలేదు. ఆ ఐదేళ్లలో కనీసం సెక్రటేరియట్‌లో కూడా అడుగు పెట్టలేదు. అధికార కేంద్రానికి దూరంగా బెంగళూరులో తన కుటుంబంతోనే ఉన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడానికి 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్‌ 1,78,846 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తండ్రి మరణం

వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందడం ఆ కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైఎస్సార్‌ అకాల మృతితో నాడు దాదాపుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా జగన్‌ సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు జగన్‌కు సూచించారు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పి జగన్‌ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా అందుకు సమ్మతించ లేదు.

ఓదార్పు యాత్ర

ఇచ్చిన మాటకు కట్టుబడి తీరాలని జగన్‌ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన గమనాన్ని, గమ్యాన్ని మార్చేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేయాలని జగన్‌ నిర్ణయించుకుంటే అందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ససేమిరా అంది. తన తల్లి, సోదరితో కలసి వెళ్లి ఓదార్పు యాత్రకు అనుమతించాలని కోరినా సోనియాగాంధీ సమ్మతించలేదు. పైగా తమ మాట వింటే కేంద్ర మంత్రిని చేస్తాం, కొన్నాళ్లకు  ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పారు. తమ మాట వినకుంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు. అధిష్టానం మాట వింటే పదవులు దక్కుతాయి. కానీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తే ప్రభుత్వం వేధిస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరున్న  వైఎస్సార్‌ తనయుడిగా జగన్‌ తన తండ్రి బాటనే అనుసరించారు. ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 640 మంది అభిమానుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

పార్టీ ఆవిర్భావం

వైఎస్‌ జగన్‌  ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు వైఎస్‌ జగన్, విజయమ్మ 2010లో రాజీనామాలు చేశారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ జగన్‌ ఏకంగా 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా జగన్‌ 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని స్థాపించారు. రైతుల సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్‌తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు  నెల్లూరు ఎంపీ స్థానంలో ఘన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆవిర్భవించింది. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జగన్‌ ప్రజా పోరాటాలు చేశారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష తదితర దీక్షలు, ధర్నాలతో ఉద్యమించారు.

కక్షతో కేసులు.. బెయిల్‌ నిరాకరణ

తిరుగులేని ప్రజానేతగా ఆవిర్భవించిన వైఎస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయి. ఆయనపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం మూడు నెలల్లో బెయిల్‌ రావాల్సి ఉండగా అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ  16 నెలలపాటు బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. అయితే జగన్‌ ఏమాత్రం వెరవకుండా  ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు.

సమైక్య ఆంధ్ర ఉద్యమం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వైఎస్‌ జగన్‌ సైద్ధాంతిక, రాజకీయ నిబద్ధత కనబరిచారు. తెలుగువారి అభివృద్ధి కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారు. అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా వ్యవహరించినా జగన్‌ 

ఒక్కడే సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. పార్లమెంట్‌లో తెలుగువారి ఆవేదనను వినిపించారు. అన్ని పార్టీలు రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించగా జగన్‌ ఒక్కడే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడి రాష్ట్ర ప్రయోజనాలపట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.

ప్రతిపక్ష నేతగా

2014 ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు. టీడీపీ సర్కారు అవినీతి, అసమర్థ విధానాలపై పోరాడారు. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగించిన భారీ భూ దోపిడీని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. ఇసుక, మైనింగ్, మద్యం,  కాంట్రాక్టు మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. చంద్రబాబు, లోకేష్‌ అండతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.  హుద్‌హుద్‌ తుపానుతోపాటు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల దుర్మరణం, ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితులు, సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్న టీడీపీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ దందా... ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా తానున్నానంటూ అండగా నిలిచారు. 

ఫిరాయింపులను ప్రోత్సహించినా

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధనను పాటించలేదు. నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరేందుకు వస్తే పదవులకు రాజీనామా చేయాలని షరతు విధించి జగన్‌ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు.

ప్రత్యేక హోదా ఉద్యమం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ చేసిన ఉద్యమం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని జగన్‌ 2014 నుంచి డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కానీ సీఎం చంద్రబాబు తన స్వార్థ, అవినీతి రాజకీయాల కోసం హోదాను గాలికి వదిలేశారు. అవినీతి, కేసుల భయంతో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మేలని అడ్డగోలుగా వాదించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలాన్ని ప్రయోగించినా జగన్‌ వెరవకుండా ప్రజల తరఫున పోరాడారు. యువభేరీ సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు హోదా కోసం దీక్షలు చేశారు. రాష్ట్ర బంద్‌తోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టి ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఎన్నికల భయంతో యూటర్న్‌ తీసుకుని హోదా కావాలని మాట మార్చినా ప్రజలు విశ్వసించలేదు.

ప్రజా సంకల్ప యాత్ర 

అవినీతి, అసమర్థత పాలనతో నష్టపోయిన రాష్ట్రం దశ, దిశను మార్చేందుకు వైఎస్‌ జగన్‌ చరిత్రాత్మక ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబరు 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. 134 నియోజకవర్గాల మీదుగా సాగుతూ 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పరిధిలో పాదయాత్ర చేశారు. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. జగన్‌ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. 

హత్యాయత్నం

పాదయాత్రలో జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెగించింది. ఏకంగా జగన్‌ను హత్య చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న జగన్‌ను హతమార్చేందుకు పదునైన కత్తితో హత్యాయత్నం జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జగన్‌ ప్రజాక్షేత్రంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా పాదయాత్రను కొనసాగించడం ఆయన దృఢ చిత్తానికి నిదర్శనం. 

ఒంటరి పోరాటం

అధికారంలోకి వచ్చేందుకు పొత్తులు పెట్టుకోవాలని కొందరు చేసిన సూచనలకు జగన్‌ సమ్మతించలేదు. తాను విశ్వసిస్తున్న రీతిలో రాజన్న ఆశయాలను సాధించేందుకు ఒంటరిగానే పోటీ చేసి ప్రజామోదం పొందాలన్న నిర్ణయానికే కట్టుబడ్డారు. మరోవైపు ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను వంచించే చంద్రబాబు 2019లో మరో కుట్రకు తెరతీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జనసేన పార్టీ విడిగా పోటీ చేసేలా పవన్‌ కల్యాణ్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీలతో  జనసేన పొత్తు కుదుర్చుకోవడం, ఆ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగాయి. టీడీపీకి మరోవైపు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కూడా ఉంది. అయినప్పటికీ జగన్‌ ఏమాత్రం వెరవకుండా తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. 

విజయ దరహాసం...

ప్రతిబంధకాలు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పదేళ్లుగా తమ కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌ను ప్రజలు తమ తీర్పుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్‌కు అఖండ విజయాన్ని చేకూర్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 151కి పైగా సీట్లతో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. విశ్వసనీయతకు పట్టాభిషేకం చేసి నూతన రాజకీయ శకానికి తెరతీశారు. కష్టాలకు వెరవకుండా నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిని ప్రజలు ఆదరిస్తారని జగన్‌ రాజకీయ ప్రస్థానం నిరూపించింది. విలువల దారిలో నడిచే నేత వెంట యావత్‌ ప్రజానీకం సాగుతుందని నిరూపించి జగన్‌  భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు.  

  • 151 స్థానాలతో వైకాపా తిరుగులేని గెలుపు
  • కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌
  • సీమలో 49 సీట్లు
  • ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో కలిపి 55, దక్షిణ కోస్తాలో 47 స్థానాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్దండులకూ తప్పని పరాభవం
  • రెండింటా ఓడిపోయిన పవన్‌.. జనసేనకు ఒక్కటే
  • 30న విజయవాడలో జగన్‌ ప్రమాణ స్వీకారం
  • మొదటివారం తర్వాత అసెంబ్లీ సమావేశాలు
  • వైఎస్‌ జగన్‌కు ముక్తకంఠంతో జేజేలు పలికిన యావత్‌ ఆంధ్రప్రదేశ్‌  
  • 151 శాసనసభ స్థానాల్లో అఖండ విజయం  
  • నాలుగు జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌.. కొట్టుకుపోయిన ప్రత్యర్థి పార్టీలు  
  • సరికొత్త రాజకీయ శకానికి శ్రీకారం 
  • లోకేశ్‌ సహా 19 మంది మంత్రులు ఔట్‌ 
  • స్పీకర్‌ కోడెల ఓటమి..  నాలుగు జిల్లాల్లో బోణీ కొట్టని టీడీపీ  
  • వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గుణపాఠం 
  • కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ
  • పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్‌ కల్యాణ్‌ చిత్తు   
టీడీపీ దిగ్గజాల ఓటమి

మాట తప్పని, మడమ తిప్పని వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి ఏపీ ప్రజలు ముక్తకంఠంతో జేజేలు పలికారు. కుట్రలు, కుతంత్రాలను ఎదురొడ్డుతూ ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పాదయాత్రికునికి పట్టం కట్టారు. దేవుడి ఆశీస్సులు కోరుతూ... రాజన్న రాజ్యం స్థాపన కోసం అలుపెరుగక శ్రమిస్తున్న జగన్‌ను మనసారా దీవించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2014లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఐదేళ్లపాటు ప్రజావ్యతిరేక పాలన సాగించిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రజల ఓటుదెబ్బకు కుదేలైపోయింది. ఆవిర్భావం అనంతరం ఎన్నడూ లేని రీతిలో కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్‌ విప్, విప్‌లతోసహా ఆ పార్టీ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. ఇక తృతీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తామని చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. వెరసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర చరిత్రలో అరుదైన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.  

పత్తాలేని జనసేన పార్టీ

  • గట్టి పోటీ 5 చోట్లే!
  • 25కు పైగా స్థానాల్లో పెద్ద మొత్తంలో ఓట్ల చీలిక
  • వచ్చింది 5.35శాతం ఓట్లే
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమవుతామని ముందుకొచ్చిన జనసేన పార్టీ ఎన్నికల్లో ఏమాత్రం బరిలో నిలువలేకపోయింది. ఈ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన స్థానాలు అయిదే కనిపిస్తున్నాయి. అదే సమయంలో 30కి పైగా శాసనసభ స్థానాల్లో జనసేన ప్రభావం వల్ల తెలుగుదేశం నష్టపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెదేపాపై ప్రభావం పడిందని పేర్కొంటున్నారు.


రాష్ట్రంలో మొత్తం 138 స్థానాల్లో జనసేన తాను పోటీకి నిలబడినట్లు పేర్కొంటోంది. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించి లెక్కలు తీయగా జనసేన పార్టీ పేరుతో 132 స్థానాల్లోనే పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదై ఉంది. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని ఇంకొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరించినట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పరిగణనలోకి తీసుకున్న 132 స్థానాల్లో జనసేన సాధించిన ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో 5.35శాతమే.

ఉత్తరాంధ్రలో మరీ తీసికట్టు

ఉత్తరాంధ్ర జిల్లాలను పరిశీలిస్తే పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలోనే 58539 ఓట్లు సాధించారు. ఇది మినహాయిస్తే మరెక్కడా 30 వేల స్థాయికి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో 10 వేల ఓట్లు దాటాయంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర సమస్యలను పవన్‌కల్యాణ్‌ విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఉద్దానం ప్రాంతం కూడా జనసేన ఆశించిన స్థాయిలో ఆదుకోలేకపోయిందనే చెప్పవచ్చు. భీమిలి, పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోనే దాదాపు 20వేలు, అంతకుమించి ఓట్లు తెచ్చుకుంది. భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లోనే దాదాపు 20 వేల వరకు ఓట్ల చీలికకు కారణమయింది.

* మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేసిన తెనాలిలో 29905 ఓట్లు వచ్చాయి. అక్కడ వైకాపా అభ్యర్థి 17649 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

* దక్షిణ కోస్తాలో కావలి, ఒంగోలు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లోనే 10 వేల స్థాయి ఓట్లు రాబట్టుకోగలిగింది. ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్‌, మదనపల్లి, పుంగనూరు వంటి చోట్ల 10 వేల నుంచి 15వేల ఓట్ల మధ్య జనసేన సాధించింది.

నోటా కన్నా తక్కువ

కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 4, 5 స్థానాల్లోకి జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌, నోటాకు వచ్చిన ఓట్ల కన్నా కూడా తక్కువగా జనసేనకు వచ్చాయి. నరసన్నపేటలో జనసేన కన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. చీపురుపల్లిలోనూ అంతే. చీపురుపల్లిలో జనసేన కన్నా నోటాకు ఎక్కువ వచ్చాయి. విశాఖ ఉత్తరంలో భాజపాకు, జనసేనకు దాదాపు దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. మాజీ మంత్రి బాలరాజు పోటీ చేసిన పాడేరులో ఆయన కన్నా స్వతంత్ర అభ్యర్థి కె. కృష్ణారావుకు అత్యధిక ఓట్లు రావడం విశేషం. గిద్దలూరులోనూ జనసేన కన్నా నోటాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి.

అక్కడే కాస్త నయం
జనసేన రాష్ట్రంలో ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలుపొందిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (భీమవరం, గాజువాక) రెండో స్థానంలోనే ఆగిపోయారు. భీమవరం, గాజువాక, నరసాపురం(రెండో స్థానం), రాజోలు, అమలాపురం స్థానాల్లో జనసేన కొంత మేర పోటీ ఇవ్వగలిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోతగ్గ ఓట్లు సాధించింది.

ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. జగన్‌ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ అతి కష్టంపై విజయం సాధించారు. దాదాపు 40 శాతం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఓటర్లు ఆ పార్టీని ఎంతగా తిరస్కరించారన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇక జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు అడ్రస్‌ లేకుండా పోయాయి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.

'జగన్ మోహన్ రెడ్డి ఎలా సీఎం అవుతాడో చూస్తా..' 'జగన్ నిన్ను సీఎం కానివ్వను..' ఇవీ వీరావేశంతో ఎన్నికల ప్రచార సభల్లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పలికిన పలుకులు. వీరావేశంతో అనడం కంటే.. వీర అహంకారంతో పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడారు అని చెప్పడం కరెక్ట్.

ఏపీకి ముఖ్యమంత్రి కావాలంటే తన ఆమోదముద్ర ఉండాలన్నట్టుగా, తను చెప్పినవారే ఏపీ సీఎం అవుతారన్నట్టుగా.. పవన్ కల్యాణ్ భ్రమపడ్డాడు. ఆ భ్రమలో కూడా తెలివిగా మాట్లాడలేదు. ఒళ్లంతా అలుముకున్న అహంకారంతో పవన్ కల్యాణ్ అనుచితంగా మాట్లాడారు. 'జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తా..' అన్న పవన్ కల్యాణ్ జగన్ ఎలా సీఎం అవుతున్నాడో ఇప్పుడు చూస్తూ ఉండవచ్చు!

'జగన్ ను సీఎంగా కానివ్వను.. ' అని చెప్పిన పవన్ కల్యాణ్ తను ఆఖరికి ఎమ్మెల్యే కాలేకపోయారు. రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. ఎందుకిచ్చారో కూడా అర్థం కానట్టుగా జనాలు ఆయన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చారు. జనసేనలో జనంలేరు, పవన్ కల్యాణ్ సినిమా పిచ్చోళ్లు మాత్రమే ఉన్నారని పూర్తిక్లారిటీ వచ్చింది. ఇకపై పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల వైపు వెళితే జనసేన కేవలం ఒక గడ్డిబొమ్మలా మిగిలే అవకాశం ఉంది కూడా.




NRI Venkat Tells Pawan Kalyan 5 Big Mistakes in AP 2019 Elections
* Video source: social media



పవన్ కల్యాణ్ - 'ఆల్ ఫెయిల్' స్టార్!

పవన్ కల్యాణ్ ను యమర్జంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేయాల్సిందే. లేకపోతే చాలా కష్టం. అలా చేసేదాకా ఆయన రాష్ట్ర ప్రజలను వదలిపెట్టరు. ఆయన ముఖ్యమంత్రి కాదలచుకున్న తర్వాత.. కాకపోతే ఇప్పటిలాగానే నానా రచ్చా చేస్తుంటారు. తాను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రాన్ని సమూలంగా ఉద్ధరించేస్తానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనని ప్రజలు ఎలా నమ్మాలి?
48ఏళ్ల జీవితంలో ఆయన ఇప్పటిదాకా చాలా చాలా రంగాలను సముద్ధరించారు. అందులో ఆయన పరిణతి ఏమిటి? ఎంత మాత్రం సక్సెస్ రేట్ ను నమోదు చేశారు? ఈ విషయాలను ఒకసారి బేరీజు వేసుకుంటే.. అసలు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలో వద్దో ప్రజలు నిర్ణయించుకోగలరు.
ముఖ్యమంత్రి సంగతి తర్వాత.. సింగిల్ ఎమ్మెల్యేని పెట్టుకుని, రెండు చోట్ల ఓడిపోయిన ఈ ఎమ్మెల్యే కేండిడేటు మాటల్ని ఆయన పోరాట పటిమను, చిత్తశుద్ధిని ఎంత మేరకు నమ్మాలో.. ప్రజలు స్వయంగా నిర్ణయించుకుంటారు. 

పవన్.. తన జీవితంలో గతంలో పోషించిన పాత్రలను పరామర్శించే ప్రయత్నం ఇది. 

ఒక గాలివాటు హీరో...  
పవన్ కల్యాణ్ ఒక గాలివాటు హీరో. చిరంజీవి మెగాస్టార్‌గా తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తూ ఉండకపోయినట్లయితే... ఇంటర్మీడియట్ చదివిన ఈ కుర్రవాడు ఏమైపోయి ఉండేవాడు. ఏదో ఖాళీగా ఉన్నాడు గనుక.. మార్షల్ ఆర్ట్స్ అంటూ కాస్త తర్ఫీదు పొందాడు గనుక.. సినిమాల్లోకి వచ్చాడు. ఏ రంగంలోనైనా ప్రవేశించిన తర్వాత.. శ్రద్ధగా ఆ రంగాన్ని అధ్యయనం చేసి అంతో ఇంతో రాణించేవారు తప్పకుండా ఉంటారు. పవన్ కల్యాణ్ కూడా అలాంటి గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ ఫ్లాప్‌తో మొదలైనా ఆ తర్వాత వరుసగా కొన్ని హిట్లు రావడం, అప్పటికే మెగాస్టార్ తమ్ముడిగా స్థిరపడిఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు అదనపు లాభాలు. కొన్ని సినిమాలు ఆడేసరికి.. ఆయన తనను మించిన హీరో లేనేలేడనే భావనలో పడిపోయారు. అక్కడినుంచి పతనం ప్రారంభం అయింది.
ఖుషీ తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. తన తాహతు ఎంతో ఏమిటో తెలియకుండా చేసిన సాహసం అది. అక్కడ ప్రారంభమైన పతనం.. జల్సాని హిట్ కింద గుర్తిస్తే ఎనిమిదేళ్లు, ఫ్లాప్ కింద గుర్తిస్తే పన్నెండేళ్లు కొనసాగింది. గబ్బర్ సింగ్ దాకా ఆయన హిట్ కోసం వెయిట్ చేశాడు. తర్వాత.. అత్తారింటికి దారేది హిట్ అనిపించుకుంది. 
రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ఎంట్రీ ఇచ్చేముందు తన సామాజిక స్పృహ నాయకత్వ లక్షణాలను సినిమాల ద్వారా ప్రజలకు రుచిచూపించడానికి  కొన్ని సినిమాలు చేశారు గానీ.. ప్రజలకు ఓపిక లేక వాటిని తిప్పికొట్టారు. ఆయన మొత్తంగా చేసింది 23 సినిమాలు. అందులో హిట్ లు పట్టుమని పది కూడా లేవు. తతిమ్మావాటలో యావరేజీలు లేవు. అన్నీ డిజాస్టర్లే. 
కానీ మన తెలుగు ప్రజల ఔదార్యం ఎలాంటిదంటే.. 40 శాతం సక్సెస్ రేషియో లేని ఒక నటుడిని సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. తమిళంలో రజనీకాంత్ తో పోల్చడానికి అత్యుత్సాహపడిపోతూఉంటాం. 

పవన్.. ఒక సక్సెస్‌ఫుల్ నటుడని ఎలా అనగలం?
ఒక యూత్ నేత...
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన తన సినీరంగ స్టార్‌డం ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ లో తమ్ముడికి అఖండిత వాటా ఇచ్చినట్టే... రాజకీయాల్లో తన ఎంట్రీకంటె ముందు.. పవన్ కల్యాణ్ ఏలుకోడానికి ఒక సామంత రాజ్యం రాసిచ్చారు. ఆ సామంతరాజ్యం పేరే యువరాజ్యం.
యువరాజ్యం రాజుగా పవన్ కల్యాణ్ ఏ రేంజిలో చెలరేగిపోయారో.. అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ వేదికల మీద నాటకాల రాయుడి మాదిరిగా పంచెకట్టుకుని ఊరేగుతున్న ఈ పెద్దమనిషి.. అప్పట్లో కాంగ్రెస్ వాళ్లని ఉద్దేశించి.. వీళ్లందరినీ పంచెలూడదీసి తరిమి కొట్టాలని మిడిసిపడ్డాడు.
ఎన్టీఆర్ కంటె రికార్డు స్థాయిలో తాను ముఖ్యమంత్రి అయిపోతానని అదేపనిగా కలలు కన్న చిరంజీవికి కూడా లేనంత పొగరు పవన్ కల్యాణ్ మాటల్లో వ్యవహారంలో నిండుగా కనిపించింది. ఆయన వ్యవహార సరళి పార్టీకి ఎన్నో చిక్కులనుకూడా తెచ్చి పెట్టింది. వాటిగురించి ఆయన ఇటీవల కూడా చాలా ఘనంగా తన వెర్షన్లోంచి చెప్పుకున్నారు. 
చిరంజీవి సీఎం అయిపోతున్నాడని పవన్ కూడా నమ్మారు. అందుకే అంత తెంపరితనంతో అప్పుడు వ్యవహరించారు. తీరా ఫలితాలు వచ్చేసరికి ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిరంజీవి పార్టీలోని అనేక మంది ఇతర నాయకులమీద ఒక రకమైన కక్ష కట్టారు. ఆ కక్షను ఇప్పటికీ పలు సందర్భాల్లో ప్రకటిస్తూనే ఉంటారు.
యువరాజ్యం అధినేతగా ఆయన ఒక ప్రాంతీయ పార్టీని.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అపరిమిత అధికారాలను కలిగిఉన్నారు. ఆ క్రమంలో ఆయన రాష్ట్రమంతా విస్తారంగా పర్యటనలు సాగించారు. సినీ ప్రేక్షక జనం ఎగబడిన సమావేశాలు తప్ప.. ఆయన తన మాటలతో ప్రజల్లో ఏం ఆలోచన రేకెత్తించారు. తమ పార్టీకి అనుకూలంగా ఎలాంటి అనుకూలతను సృష్టించగలిగారు. యువరాజ్యాధినేతగా ఏం సాధించారు?
పవన్.. ఒక సక్సెస్‌ఫుల్ యువనాయకుడని ఎలా అనగలం?
ఒక సంఘ సంస్కర్త...
పవన్ కల్యాణ్ కు మరొక భ్రమ కూడా ఉంది. తనలో అంతర్లీనంగా ఒక అత్యద్భుతమైన సంఘ సంస్కర్త కూడా ఉన్నాడని ఆయన నమ్మకం. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించేలా చేయడానికి ఆయన అనేక రకాలుగా తపన పడుతూ ఉంటారు. తాను విశ్వమానవుడినని ఆయన పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తన పిల్లలకు తెలుగు-రష్యన్, హిందూ-క్రిస్టియన్ కలగలుపు పేర్లు పెట్టుకుని.. అక్కడికేదో తాను అంతర్జాతీయ పౌరసత్వం కలిగి ఉన్నట్లుగా ఆయన మురిసిపోతూ ఉంటారు. ఒకరికి విడాకులు ఇచ్చేదాకా రెండో అమ్మాయిని ‘పెళ్లి చేసుకోలే’దు గనుక తనకు మించిన నియమబద్ధమైన మనిషి మరొకడు లేనేలేడని ఆయన భావిస్తూ ఉంటారు. 
కులాలు లేవు మతాలు లేవు.. ధనిక పేద తారతమ్యాలు లేవు.. అని వేదికలెక్కినప్పుడు తిరుగులేని ఉపన్యాసాలు దంచుతూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ ముసుగులో కాపుల రిజర్వేషన్‌కు మద్దతివ్వమని ఆ కులాల వారు కోరినప్పుడు.. చంద్రబాబును నొప్పించలేక దాటవేసిన పవన్ కల్యాణ్ వాస్తవంలో చేసిందేమిటి? తన అన్నయ్య కూతురు, ఒక స్నేహితుడిని పెళ్లి చేసుకోదలచుకుంటే.. పవన్ ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. కేవలం పవన్ తమను చంపేస్తాడనే భయం ఉన్నందువల్లే పారిపోతున్నట్లు ఆ అమ్మాయి చెప్పిందంటే ఆయనలోని సంఘసంస్కర్తని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఆ సందర్భంలో.. రివాల్వర్ ను తీసుకువెళ్లి.. దాన్ని పోలీసు స్టేషన్లో అప్పగించడం అనే పేరిట పవన్ ఎంతటి హైడ్రామా నడిపించారో కూడా అందరికీ తెలుసు. సొంత కుటుంబం వద్దకు వచ్చేసరికి ఆయనకు అన్ని రకాల తారతమ్యాలూ అనుభవంలోకి వచ్చాయి. వెలివేసినట్లుగా ఆయన అన్నయ్య కుటుంబానికి చాలా కాలం దూరం ఉండిపోయినట్లుగా, వివాహాది శుభకార్యాల్లో కూడా అంటీముట్టనట్టు వ్యవహరించినట్లుగా కూడా గుసగుసలు వినిపించాయి. ఇదేనా ఆయనలోని సంఘసంస్కర్త ఎరిగిన మర్యాద!
పవన్.. ఒక సామాజిక సంస్కర్త అని ఎలా నమ్మగలం?
ఒక జనసేనాని..
ఇప్పుడిక వర్తమానంలోకి రావాలి. 2014 ఎన్నికలకు పూర్వం పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేనను స్థాపించారు. అప్పటికి పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండేళ్లలో రెండు హిట్ చిత్రాలతో మాంచి జోరు మీద ఉన్నారు. అయితే ఆయన తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ‘అమ్మేసుకున్నారు’! ఆయన అభిమానులకు చేదుగా ధ్వనించినప్పటికీ ఇది నిజం. రాష్ట్రంలో బలమైన కాపు వర్గం ‘తమ’ అంటూ ‘ఓన్’ చేసుకున్న హీరో ఆయన. చంద్రబాబు నాయుడు వేసిన ఎరకు ఆయన సులువుగా లొంగిపోయారు. 
అప్పట్లో వైఎస్ జగన్మోహన రెడ్డికి అంతో ఇంతో సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఆయనను ఓడించడానికి అన్ని రకాల మాయోపాయాలను పన్నితే తప్ప.. గండం గట్టెక్కలేమని అప్పటికే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండడం వల్ల కుదేలైపోయి ఉన్న చంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. తాను తీవ్రంగా తిట్టిపోసిన మోడీ పల్లకీని భుజాన మోయడానికి సిద్ధపడ్డారు. మోడీ హవాను తనకు అనుకూలంగా వాడుకోదలచుకున్నారు. ఏమాత్రం చాన్స్ తీసుకోకూడదని.. పవన్ తోనూ బేరం సెట్ చేసుకున్నారు. 
‘జగన్‌ను అధికారంలోకి రానివ్వకపోవడం’ అనే ఒకే ఒక ఎజెండాతో.. పవన్ కల్యాణ్ మోడీ-చంద్రబాబు లతో కలిసి రాష్ట్రమంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కొద్ది తేడాతో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకవైపు సినిమాలు చేసుకుంటూ అడపాదడపా ప్రజా సమస్యల మీద టూర్లు, ప్రకటనలు చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు సొంతంగా బరిలోకి దిగారు. జగన్ ను ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. రెండు పెద్ద పార్టీలు కొట్టుకుంటూ ఉంటే.. తనకు పిడికెడు సీట్లు దక్కినా.. ప్రభుత్వాన్ని శాసించే హోదా వస్తుందనే ఆశతో ఎగబడి ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ నాయకుడూ కనబరచనంత ఆత్మవిశ్వాస లేమితో రెండు సీట్లలో పోటీచేశారు. చివరికి రెండింటా ఓడారు. జనం ఆయనను ఛీకొట్టారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టిన తొలి బహిరంగ కార్యక్రమం విశాఖ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిలవుతుందో నని తెదేపా, భాజపా మద్దతు కోరారు. భాజపా ఛీత్కరించుకుంది. చంద్రబాబు.. పవన్ కు మద్దతివ్వడానికి ఉత్సాహపడ్డారు. ఆ మార్చ్‌కు ఆ రీతిగా జనసమీకరణ పూర్తయింది. 
ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే.. ఇప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఒక కార్యక్రమానికి, ఉద్యమానికి, పోరాటానికి, ఆందోళనకు పిలుపు ఇవ్వగల దమ్ము పవన్‌కు లేదు. రాష్ట్రవ్యాప్త పోరాటాలకు పిలుపు ఇస్తే.. చాలాచోట్ల స్థానికంగా తమ పార్టీకి దిక్కులేదనే సంగతి బయటపడిపోతుందని ఆయనకు భయం.
కోట్లకు కోట్ల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేశానని, ఇక సినిమాలు చేయనని ప్రకటించిన పవన్ మళ్లీ కథలు వింటున్నారు. తాను తిరిగి సినిమాలు చేయబోతున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. జనసేన భవిష్యత్ రాజకీయాలు అనేవి షాట్‌గ్యాప్‌లో చేసే రాజకీయాలు మాత్రమే అని ఆయన చాలా తెలివిగా నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మాయచేసే ప్రయత్నంలో ఉన్నారు.
పవన్.. ఒక జనసేనాని అని ఎలా విశ్వసించడం?
ఒక నాయకుడు...
జనసేనాని కాకపోయినా పర్లేదు. ప్రజాజీవితంలో గడపదలచుకున్నప్పుడు... కనీసం ఆ విషయంలో చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటిదాకా పవన్ తనంతగా తాను గుర్తించి.. పరిష్కారం వరకు అండగా ఉండి పోరాడిన ప్రజాసమస్య ఏదైనా ఉందా? ఉద్ధానం అన్నారు. హడావిడి చేశారు. చంద్రబాబును కలిశారు. అక్కడితే వదిలేశారు. వారికోసం జగన్ ప్రత్యేకపథకాలు తెస్తే.. కనీసం అభినందన పూర్వకంగా ఒక్కమాట కూడా అనలేదు. గోదారి జిల్లాలో ఆక్వా గొడవ అన్నారు. తిరుపతిలో భూమి గొడవలు అన్నారు. రాజధానిలో రైతుల గోడు అన్నారు. మెడికల్ కాలేజీ గొడవ అన్నారు.... ఇవే కాదు! ఇప్పటిదాకా పవన్ చేపట్టిన ఏ అంశంపై కూడా ఆయన నిర్దిష్టంగా సమస్య తీరే వరకు పట్టించుకున్నది లేదు. ఆయన స్వయంగా ప్రజల బాధలను గుర్తించి, తెలుసుకుని, పోరాడింది కూడా లేదు. 
ఎవడో ఒక దళారీ ఉంటాడు. వాడికి కొన్ని వక్ర ప్రయోజనాలు ఉంటాయి. వాడు ఒక సమస్యను హైప్ చేస్తాడు. వాడు ఆ బాధితులకు పవన్ కల్యాణ్ చెంతకు ‘యాక్సెస్’ను కొనుగోలు చేయగలడు. ఆయన వద్దకు తీసుకువస్తాడు. వారందరూ పవన్ ఎదుట కూర్చుని.. తమ గోడు వెళ్లబోసుకోగానే.. గదిలోంచి ఆయన బయటకు వచ్చి.. వారి తరఫున తాను పోరాడుతానని.. ప్రభుత్వం తాటతీస్తానని హెచ్చరిస్తారు. ఒక ప్రెస్ నోట్ వస్తుంది. అంతటితో ఆ ఎపిసోడ్ ముగిసిపోతుంది. మహా అయితే.. ఒక ట్రిప్.. ఆ ప్రాంతానికి వెళ్లి రావడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత పట్టించుకున్నది మాత్రం ఇప్పటిదాకా లేదు! నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గోడు అయినా అంతే.. ఇవాళ ఏపీలో ఇసుక సమస్య అయినా అంతే! వారి ఏడుపులు కొనసాగుతూ ఉండగానే.. పవన్ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి.. మేకప్ పులుముకున్నా ఆశ్చర్యం లేదు. 
విపక్షంలో ఉన్నందుకు ప్రభుత్వానికి ఒక సలహా చెప్పడం లేదు. నిందించడం హీరోయిజం కాదు.. ప్రభుత్వానికి సరైన మార్గదర్శనం చేయడం హీరోయిజం అనిపించుకుంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు అలాంటి దార్శనికతను చూపిస్తే.. ప్రజలు మెచ్చుకుని.. ఈయన సామర్థ్యాలను గుర్తించి.. ఈసారి పట్టం కడతారు. అర్థం పర్థం లేకుండా అరుస్తూపోతే.. వాటికి జనంలో మన్నన ఉండదు. కోటలు దాటే మాటలు ఓట్లు వేయించవు. ఆ విషయం గత ఓటములనుంచే ఆయన పాఠంగా నేర్చుకుని ఉండాలి. 
ఇలాంటి పవన్ కల్యాణ్.. ఒక నాయకుడు అని ఎలా ఆమోదించడం?
రాజకీయం ‘షాట్ గ్యాప్ ఎరీనా’ కాదు. షూటింగ్ షాట్‌కు షాట్‌కు మధ్య గ్యాప్‌లో మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటే బాగుంటుంది. లేదంటే ఫోటోలకు మంచిగా కనిపించడానికి, తనకు ఇష్టం కూడా ఉన్నది గనుక పుస్తకాలు, కవిత్వమూ చదువుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఆ షాట్ గ్యాప్‌లో ఓ ప్రజాసమస్యపై ప్రెస్‌నోట్ రిలీజ్ చేసేద్దాం అనుకోకూడదు.
షూటింగ్ షెడ్యూలుకు షెడ్యూలుకు మధ్య గ్యాప్ సకుటుంబంగా ట్రిప్‌లు వెళ్తే బాగుంటుంది. అంతే తప్ప.. ప్రజల చెంతకు అంటూ ఓ యాత్ర సాగిస్తే లాభపడతాం అనుకోకూడదు. 
రాజకీయం అనేది ఆటవిడుపు కాదు. పైన ప్రస్తావించిన అన్ని రకాల హోదాల్లోనూ పూర్తిస్థాయిలో విఫలమైన వ్యక్తి.. పవన్ కల్యాణ్ తాను ‘ఆల్ ఫెయిల్’ కేండిడేట్ అని తెలుసుకోవాలి. కొత్త హోదాను కోరుకుంటే.. తదనుగుణంగా సరైన దిశలో కసరత్తు చేయాలి.

జగన్‌ సునామీలో కొట్టుకుపోయిన టీడీపీ 

వైఎస్‌ జగన్‌ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు 
తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీడీ పీనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జగన్‌ ప్రభం జనంలో టీడీపీలోని అతిరథ మహారథులు కూడా కొట్టుకుపోయారు. టీడీపీ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాలు కూడా జగన్‌ ప్రభంజనం ధాటికి తునాతునకలైపోయాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల్లో 21 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలయ్యారు.



మంత్రులు కళా వెంకట్రావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు చిత్తుగా ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఘోర పరాజయం పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం చవిచూశారు. 2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన 23 మందికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వాళ్లలో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబు తాను పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలో వెనుకబడటంతో టీడీపీ షాక్‌కు గురై కొంతసేపు బెంబేలెత్తిపోవడం ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. 


గురువారం ఉదయం ఎనిమిదింటికి ఓట్ల లెక్కింపు మొదలయ్యాక పోస్టల్‌ బ్యాలెట్‌తోనే వైకాపా విజయయాత్ర మొదలైంది. తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికే ఆ పార్టీ ఘనవిజయం సాధించనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. మరో రెండు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి వైకాపా విజయం ఖాయమైంది. చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు ప్రతి దశలోనూ అప్రతిహతంగా దూసుకుపోయింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌ పులివెందులలో 89,700 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. జగన్‌ సొంత జిల్లా కడపతో పాటు, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైకాపా అన్ని స్థానాలూ ఊడ్చేసింది. ఒకప్పుడు తెదేపాకు కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ముఖ్యంగా వైకాపాకు పట్టున్న రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి ఓట్ల వర్షమే కురిసింది. సీమ నాలుగు జిల్లాలలో తెదేపాకు రెండు సీట్లే దక్కాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెదేపా ఒకే ఒక్క సీటు కుప్పంను దక్కించుకుంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఒక్క సీటూ దక్కలేదు. అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు బాలకృష్ణ మరోసారి గెలిచారు. 

గురువారం అర్ధరాత్రి వరకు ఉరవకొండలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకుగాను వైకాపా 28 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలూ వైకాపా వశమయ్యాయి. శ్రీకాకుళంలో తెలుగుదేశానికి రెండు స్థానాలు దక్కాయి. విశాఖ జిల్లాలో మాత్రం తెదేపా కాస్త పరువు నిలబెట్టుకోగలిగింది. అక్కడ ఆ పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. గత ఎన్నికల్లో తెదేపాకు కంచుకోటలుగా నిలిచిన ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఈసారి వైకాపా విజయకేతనం ఎగురవేసింది. ఈ రెండు జిల్లాలకు కలిపి తెదేపాకు ఆరు, జనసేనకు ఒకటి మాత్రమే దక్కాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోను ఈసారి వైకాపా తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. రెండు జిల్లాల్లో 4 స్థానాలు మాత్రమే తెదేపాకు దక్కాయి. అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైకాపా గాలి బలంగా వీచింది. ప్రకాశం జిల్లాలో తెదేపా 4 సీట్లు గెలుచుకోగా, నెల్లూరులో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, ఈ ఎన్నికల్లో తెదేపాకు ఓట్లు సాధించి పెడుతుందని చంద్రబాబు ఆశించగా, కనీసం రాజధాని ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ ఆ ప్రభావం లేకపోవడం గమనార్హం.  మంగళగిరిలో లోకేష్‌, తాడికొండలో శ్రావణ్‌కుమార్‌ ఓటమిపాలయ్యారు.

ఏపీ సీఎంలలో జగన్‌ మూడో పిన్న వయస్కుడు



వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి....అతి పిన్న వయసులో సీఎం కానున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 సంవత్సరాల 6 నెలలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కానీ ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో దామోదరం సంజీవయ్య అత్యంత పిన్న వయస్కులు. ఆయన 38 సంవత్సరాల 11 నెలల వయసులో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత 45ఏళ్ల 5నెలల అతి తక్కువ వయసులో ముఖ్యమంత్రైన వారి జాబితాలో చంద్రబాబునాయుడు ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే.. అసోం ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రఫుల్లకుమార్‌ మహంత అత్యంత పిన్న వయసు(33 ఏళ్లకే)లో 1985లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అఖిలేష్‌కుమార్‌ 2012 మార్చి 15న 39 ఏళ్ల వయసులో సీఎం పీఠం అధిరోహించారు.

వైఎస్‌ జగన్‌ రికార్డు మెజారిటీ

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు వైఎస్‌ జగన్, ఆయన మాతృమూర్తి విజయమ్మ రాజీమాలు చేశారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలంటూ వారి తీర్పునే కోరారు. 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్, టీడీపీలు తమ తరపున సీనియర్లు డీఎల్‌ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డిలను బరిలోకి దింపాయి. అయితే అక్కడి ప్రజలు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి 5,45,672 మెజారిటీ ఇచ్చారు. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో అప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడో అత్యధిక మెజారిటీ రికార్డును వైఎస్‌ జగన్‌ సొంతం చేసుకున్నారు. (2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌ నియోజకవర్గంనుంచి సీపీఎం అభ్యర్థి అనిల్‌ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో నెగ్గి అప్పటి వరకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారు. 1991 ఉప ఎన్నికల్లో అప్పటికే ప్రధాని పదవిలో ఉన్న పీవీ నరసింహారావు కాంగ్రెస్‌నుంచి పోటీచేసి 5,80,035 మెజారిటీ సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. 

చిన్నాచితకా పార్టీలు నామమాత్రపు పోటీ ఇచ్చాయి.) అనంతరం 2014 జనరల్‌ ఎన్నికల్లో గుజరాత్‌లోని వదోదర లోక్‌సభ స్థానం నుంచి అప్పటి గుజరాత్‌ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5,70,128 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. 2014లో మహరాష్ట్రలోని బీడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్‌ ముండే 6,92,245 ఓట్ల మెజారిటీ సాధించి ఆమె లోక్‌ సభ ఎన్నికల చరిత్రలో మొదటి స్థానాన్ని పొందారు. మిగిలిన వారంతా ప్రధాన పార్టీలనుంచి పోటీ చేయగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగి అనూహ్య విజయాన్ని సాధించారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో తొలిహిట్‌... 
- 2014 జనరల్‌ ఎన్నికల్లో పులివెందులనుంచి తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మొదటి హిట్టే దిమ్మతిరిగేలా కొట్టారు. 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇది కూడా సీమాంధ్రలో రికార్డే. విజయమ్మ తరువాత ఇంత మెజారిటీ ఎవరూ సాధించలేదు. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్షనేతగా పులివెందులనుంచే బరిలోకి దిగి 90, 110 ఓట్ల మెజారిటీ సాధించారు.         2011 ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆ మెజారిటీని ఆ తరువాత ఏపీలో ఎవ్వరూ దాటలేకపోయారు.  



నారి.. విజయ విహారి

వైఎస్సార్‌సీపీ నుంచి 16 మంది, టీడీపీ నుంచి ఒకరి గెలుపు


15 మంది పోటీ చేయగా 13 మంది విజయం



ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, నగరి నుంచి ఆర్‌.కె. రోజా, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్‌సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి విజయం సాధించారు.


అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి
  • ఉద్దండుల్ని ఓడించిన ఘనత సొంతం
  • గతంలో కంటే రెట్టింపు మెజారిటీ
అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించనున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. గతంలో హర్యానాకు చెందిన దుష్యంత్‌ చౌహన్‌ 28 ఏళ్ల వయస్సులో ఎన్నికై పార్లమెంట్‌కు వెళ్లి అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పుడు మాధవి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె ఎంపీగా ఎన్నికై  పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌ వంటి ఉద్దండుల్ని ఓడించి మాధవి ఘనత సాధించడమే కాకుండా పిన్న వయస్కురాలిగా పార్లమెంట్‌కు వెళుతుండడం విశేషం.


గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతకు 4,13,191ఓట్లు రాగా 91,398 పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన గొడ్డేటి మాధవికి 2.25 లక్షల మెజార్టీ రావడం విశేషం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌కు 3,60, 458 ఓట్లు రాగా 1,92,444 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే స్థాయిలో మాధవి కూడా భారీ ఆధిక్యత సాధించి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎంపీలందరి కంటే మాధవికి భారీ ఆధిక్యత లభించింది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌సీపీకి మన్య ప్రాంత ప్రజలంతా బ్రహ్మరథం పట్టడంతో గొడ్డేటి మాధవికి భారీ ఆధిక్యత లభించింది.

వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను: పూరీ













ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు.

‘‘ఎలక్షన్‌ రిజల్ట్స్‌ వచ్చిన  రోజు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరం కలిసి టీవీలో రిజల్ట్స్‌ చూస్తున్నాం. ఎందుకంటే నా తమ్ముడు ఉమా శంకర్‌ గణేష్‌ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి  వైఎస్సార్‌ సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఫలితాలు ఎంతో టఫ్‌గా ఉంటాయని ఊహించిన మాకు వార్‌ వన్‌ సైడ్‌ అయ్యేసరికి మతిపోయింది. ఏపీ ప్రజలందరూ సీక్రెట్‌గా మీటింగ్‌ పెట్టుకుని జగన్‌నే ఎన్నుకుందాం అని కూడబలుక్కొని ఓట్లు వేసినట్లు అనిపించింది. ఇన్ని కోట్లమంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు. హ్యాట్సాఫ్‌ టు జగన్‌ మోహన్‌రెడ్డిగారు.

జగన్‌ మోహన్‌రెడ్డిగారు చేసింది ఒకరోజు ఎలక్షన్‌ కాదు. పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ, రాజన్న ఎత్తున్న తల్వార్‌ పట్టుకుని పదేళ్ల పాటు రణరంగంలో నిల్చున్న యోధుడు జగన్‌. విజయం సాధించిన తర్వాత ఆయన మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయగర్వం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. రాజన్న కుమారుడు అనిపించుకున్నాడు. వై.ఎస్‌.జగన్‌ ఒక వారియర్‌. దైవ నిర్ణయం, ప్రజానిర్ణయం వల్ల ఈ విజయం వచ్చిందని ఆయన తన మాటల్లో చెప్పాడు.

కానీ ప్రజానిర్ణయం దైవనిర్ణయం కంటే గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్‌ అయ్యాడు. కాని ప్రజలు తలుచుకుంటే దేవుడ్ని మార్చగలరు. ప్రజలంతా సమైక్యంగా జగన్‌గారికి మొక్కేశారు. నా తమ్ముడికి జగన్‌గారంటే ప్రాణం. ఆయన ఫొటో చూసినా, వీడియో చూసినా ఎగై్జట్‌ అవుతాడు. ఓ సూపర్‌స్టార్‌లా చూస్తాడు. వాడు అలా ఎందుకు చూస్తాడో నాకిప్పుడు అర్థమవుతోంది. గత ఎన్నికలలో నా తమ్ముడు ఓడిపోయినా, భుజం తట్టి, చేయి పట్టుకుని మళ్లీ యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన జగన్‌ మోహన్‌రెడ్డిగారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం.

నేను రాజకీయాలలో లేను. కానీ నాకు పోరాట యోధులంటే ఇష్టం. నా దృష్టిలో జగన్‌ అంటే ఒక లయన్‌ కింగ్‌ - పూరి జగన్నాథ్‌

జగన్‌ పట్టుదల, ఓర్పు గెలిపించాయి

ప్రజలు కోరుకున్న పాలన అందించాలని ఆశిస్తున్నాం

ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుపుపై సెలబ్రిటీల మనోగతం
నికార్సైన వ్యక్తిని ఎంచుకున్నారు
జగన్‌పై ప్రజలపై ఉన్న అభిమానం ఈ రోజు ఆయనకు అంతటి ఘన విజయాన్ని కట్టబెట్టింది. జగన్‌ విజయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు నిజమైన పాలనను, నిఖర్‌సైన వ్యక్తిని ఎంచుకున్నారనే విషయం ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు వారు కోరుకున్న పరిపాలనను అందించాలని జగన్‌ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.– దగ్గుబాటి సురేష్‌ బాబు, ప్రొడ్యూసర్‌.

ఇది ప్రజా విజయం
ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి.  అందరి దృష్టి ఏపీపైకి మళ్లించాయి. నిజం చెప్పాలంటే ఇంత భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్సార్‌సీపీది ప్రజా విజయం. ప్రజలే ఆయనను గెలిపించుకున్నారు. ఏ హామీలనైతే నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారో..ఆ హామీలను ఈ ఐదేళ్లల్లో అమలు చేయాలని ఆశిస్తున్నా.
– ఆదిపినిశెట్టి, హీరో

అనూహ్య విజయం
అందరం ఉహించినట్లుగానే వైఎస్సార్‌సీపీ విజయాన్ని సాధించింది. అయితే ఇంత భారీ మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఎన్నికల మేనిఫెస్టొలో ఇచ్చిన నవరత్నాలను పక్కాగా అమలు చేస్తానంటూ చెప్పడం ఆనందంగా ఉంది. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో గెలిచానని చెప్పడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఇంత ఘన విజయాన్ని సాధించిన ఆయన బతికున్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఈ విషయంలో ఏ మాత్రం డౌట్‌ లేదు. 
– తమ్మారెడ్డి భరద్వాజా, నిర్మాత

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం
తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఫైనల్లీ ఏపీకి ఒక యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ ముఖ్యమంత్రిగా అయ్యారు. జగన్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఓపిక, నిరాడంబరత, నిబద్దత, గౌరవం, పోరాడే శక్తి, తెలివితేటలు  ఈరోజు ఆయనను ఈ హోదాలో నిలబెట్టాయి. ఆయనని చూసి నేను గర్విస్తున్నా, నాకైతే ఎంతో ఆనందంగా ఉంది.
– ప్రిన్స్, హీరో

మిరాకిల్‌ విజయం
40 ఏళ్ల చరిత్రలో ఇలాంటి విజయాన్ని మొట్టమొదటి సారి చూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. జగన్‌ కష్టం, అదృష్టం, శ్రమ, పట్టుదలతో పాటు చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత గెలిపించాయనే చెప్పాలి. ఓ మంచి పార్టీకి సపోర్ట్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా మైనార్టీ ఓటర్లు 85శాతం మంది రాత్రి వరకు క్యూలో నిల్చుని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని జగన్‌ నాయకత్వాన్ని ఎంచుకున్నారు. ఒక మైనార్టీగా మైనార్టీలందరికీ జగన్‌ గెలుపు సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
–  అలీ, హాస్యనటుడు

కేఏ పాల్‌కు 281 ఓట్లు




కేఏ పాల్‌....ఆయనో సంచలనం. ఈసారి ఎన్నికల్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాలైతే ఆయన ప్రచార చిత్రాలతో హోరెత్తాయి. అయితే ఇవేవీ ఆయనకు ఓట్ల వర్షం కురిపించలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి రాష్ట్రంలో ఒక్కచోటా డిపాజిట్టు దక్కలేదు, ఎక్కడా కూడా 300కు ఓట్లు మించి పడలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన పాల్‌కు 281 ఓట్లు పడ్డాయి. ఆయన నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు.. అక్కడ ఆయనకు 2987 ఓట్లు దక్కాయి.  ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలీకాఫ్టర్‌ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్‌ గుర్తును పోలి ఉందని వైకాపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు, కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన అభ్యర్థులే ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ... అలాంటి చోట కూడా ప్రజాశాంతి పార్టీకి డిపాజిట్టు రాలేదు.

ఎక్కడా 300కు మించి ఓట్లు రాలేదు
ఆంధ్రప్రదేశ్‌లోని 22 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా రంగంలోకి దింపిన అభ్యర్థుల పేర్లతో పోలిన పేర్లు గల వారినే తమ అభ్యర్థులుగా ప్రజాశాంతి పార్టీ బరిలోకి దింపినా ఎటువంటి ప్రభావం కనపడలేదు. ఈ పార్టీకి కేటాయించిన హెలీకాఫ్టర్‌ గుర్తులోని ఫ్యాన్‌ రెక్కలు, వైకాపా ఫ్యాన్‌ గుర్తు రెక్కలు ఒకేలా ఉండటంతో పాటు, పేర్లలో పోలిక ఉండడంతో వైకాపా శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు అత్యధికంగా ఆలూరులో 1327 ఓట్లు రాగా... పలమనేరులో 1107, ఒంగోలులో 400, పెనమలూరులో 300, జమ్మలమడుగులో అత్యల్పంగా 119 ఓట్లే వచ్చాయి.  మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా 300కు మించి ఓట్లు రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు.

వారసులేమయ్యారు

ఇంతకు మునుపెన్నడూ లేనట్టుగా ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లోని ప్రముఖ నేతలు తమ వారసులను రంగంలోకి దింపారు. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయించడం ద్వారా తమ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కొందరు కుమారులు..సోదరులను, మరికొందరు కుమార్తెలను..ఇంకొందరు కోడళ్లను, అల్లుళ్లను పోటీలో దింపి..వారికి గెలిపించుకునేందుకు ఆహోరాత్రులూ కష్టపడ్డారు. కొన్ని చోట్ల చనిపోయిన, వృద్ధులైన నేతల వారసులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. వారిలో కొందరి ఆశలు ఫలించగా.. మరికొందరి ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యంగా తెదేపా నుంచి పోటీ చేసిన వారసుల్లో దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవాని, ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, హిందూపురం నుంచి ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ మినహా అందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌, మంత్రులు పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి కుమారులు పరాజయాన్ని చవిచూశారు. జేసీ సోదరుల తనయులూ ఓడిపోయారు.



ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని ఓట్లు?

ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల సంఖ్య పరంగా స్పష్టత వచ్చింది. ఇందులో వైకాపా అత్యధిక ఓట్లతో విజేతగా నిలిచింది. తర్వాత స్థానంలో తెదేపా నిలిచింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా విడివిడిగా 4 లక్షలలోపు ఓట్లే సాధించాయి. ప్రధాన పార్టీల పరంగా రాష్ట్రంలో సాధించిన ఓట్ల సంఖ్య ఇలా ఉంది.

మొత్తం పోలయిన ఓట్లు: 3,13,33,631



జగన్‌కు కేసీఆర్‌ స్నేహ హస్తం...కలసి సాగుదాం























హంసవీణ (కరీంనగర్‌ పిలిగ్రీ) జ్ఞాపిక







 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top